Monday, 28 September 2009

'అణు'మానాలు తొలగించాలి

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై భారత్‌ సంతకం చేయాలన్న వత్తిడిని మరోసారి అమెరికా ప్రారంభించిందంటే కేంద్రంలోని యుపిఏ సర్కార్‌ను మరోసారి అనుమానించకతప్పటం లేదు. ఇటువంటి వత్తిళ్లు వస్తాయని గతంలోనే సిపిఎం ఇతర వామపక్షాలు కేంద్ర సర్కార్‌ను హెచ్చరించాయి. ఇప్పుడది నిజమని రుజువైంది. బుష్‌ విధానాల నుంచి మార్పుకు ప్రయత్నిస్తానని చెప్పి గద్దె నెక్కిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇప్పుడు అదే బుష్‌ బూట్లలో కాళ్లుపెట్టి నడిచేందుకు పూనుకున్నారని వెల్లడైంది. అణ్వస్త్రాలు కలిగిన, లేని దేశాల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఒప్పందాన్ని ఇంతవరకు అంగీకరించని నాలుగు దేశాలలో భారత్‌ ఒకటి. పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తరకొరియా మిగిలిన మూడు. వీటిలో ఉత్తర కొరియా గతంలో ఒప్పందంపై సంతకం చేసింది.



అయితే అమెరికా తాను ఇచ్చిన హామీల నుంచి వైదొలగటంతో దానికి నిరసనగా ఉత్తర కొరియా ఎన్‌పిటి నుంచి వైదొలగింది. తన ప్రయోజనాలకోసం అమెరికా ముందుకు తెచ్చిన ఎన్‌పిటి ఒప్పందంతో తాము కూడా లబ్దిపొందే అవకాశం ఉంది కనుక అణుదేశాలుగా గుర్తింపు పొందిన బ్రిటన్‌,ఫ్రాన్స్‌,చైనా, రష్యా కూడా దానిని బలపరిచాయి. పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ తన కనుసన్నలలో మెలిగే దేశాలే కనుక వాటి గురించి అమెరికా నోరెత్తదు. తాము అణ్వస్త్రాల వ్యాప్తికి వ్యతిరేకమేనని, అదే సమయంలో ముందుగా తాము వాటిని వినియోగించబోమని ఏకపక్షంగా ప్రకటించిన భారత్‌ తమ రక్షణ అవసరాల రీత్యా ఎన్‌పిటిపై సంతకం చేసేది లేదని గత నాలుగు దశాబ్దాలుగా చెబుతోంది. ఈ విధానం నుంచి వైదొలగబోమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గతంలో ప్రకటించారు.



ఇదే సమయంలో మన దేశాన్ని అణుదేశంగా గుర్తిస్తే ఎన్‌పిటిపై సంతకం చేయటానికి అభ్యంతరం లేదని తొలిసారిగా చెప్పటంతో ప్రధాని రెండునాలుకలతో మాట్లాడుతున్నారని, ఇంతకాలంగా అనుసరిస్తున్న విధానం నుంచి వైదొలగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వెల్లడైంది.


అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం(123 ఒప్పందం)లో ఎన్‌పిటిపై మనం సంతకాలు చేయాలన్న నిబంధనలేవీ లేవని 2006 ఆగస్టు17న, ఆతరువాత 2007లో కూడా పార్లమెంట్‌ ఉభయసభలలో చేసిన ప్రకటనలో కూడా నమ్మబలికారు. అయితే వామపక్షాల వత్తిడి మేరకు పార్లమెంట్‌కు సమర్పించిన 123 ఒప్పందంలో ఎన్‌పిటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే సమయంలో మనదేశం దానిపై సంతకం చేయాలన్న మినహాయింపు ఇచ్చినట్లు కూడా లేదు. అయితే ప్రధాని పార్లమెంట్‌కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా దానిలో ఒక మెలిక ఉంది.



అమెరికాతో కుదుర్చుకున్న 123 ఒప్పందానికి అణునిరాయుధీకరణ ఇరుసువంటిది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. 1968లో ఉనికిలోకి వచ్చిన ఎన్‌పిటి ఒప్పందంలో ప్రొలిఫరేషన్‌ అనే పదానికి ఎలాంటి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. దానికి విస్తరణ, వ్యాప్తి, పునరుత్పాదన అనే అర్ధాలున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం గుర్తింపు పొందిన అణు దేశాలు అప్పటికే తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను, వాటి విధ్వంసక శక్తిని పెంచుకోవచ్చు. మనం కుదుర్చుకున్న 123 ఒప్పందంలో కూడా ఈ పదం ఉంది గాని దానికి ఇక్కడ కూడా నిర్వచనాన్ని విస్మరించారు. అందువల్లనే మనకు ఎన్‌పిటి వర్తించదని యుపిఏ సర్కార్‌ భాష్యం చెప్పింది. అయితే 123 ఒప్పందంలో చెప్పిందేమిటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లక్ష్యాలు, రక్షణ వ్యవస్థకు అనుగుణంగా ఆధునిక అణుపరిజ్ఞానం పొందిన దేశాలు దానిని అణ్వాయుధాల తయారీకి వినియోగించ కూడదు.



అలా చేయాలంటే రెండు పక్షాలూ అందుకు అంగీకరించాలి. కనుక మనదేశం ఎన్‌పిటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ డొంకతిరుగుడు హామీల గురించి చెప్పకుండా తక్కువ చేసి చూపటం, విస్మరించినట్లు వ్యవహరించటంతో యుపిఏ సర్కార్‌ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయి. వామపక్షాలు దీనికి వ్యతిరేకంగానే యుపిఏ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాయి. సమాజవాదిపార్టీ మరికొన్ని పార్టీల మద్దతుతో యుపిఏ సర్కార్‌-1 విశ్వాసపరీక్షలో గట్టెక్కింది. ఆ తరువాత ఒప్పందం కుదిరే వరకు దాని గురించి పట్టుబట్టని అమెరికా ఇప్పుడు దాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది కనుక అనుమానించాల్సి వస్తోంది.పిట్స్‌బర్గ్‌లో జరిగిన జి-20 సమావేశాలకు ముందుగా భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించి ఆమోదం పొందిన తీర్మానంలో నేరుగా భారత్‌ పేరెత్తకపోయినా వచ్చే ఏడాది జరిగే ఎన్‌పిటి సమీక్షా సమావేశాలలోగా అన్ని దేశాలూ ఒప్పందాన్ని ఆమోదించాలని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సహకరించాలని కోరింది.



తాము కూడా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిరోధ ఒప్పందం(సిటిబిటి)పై సంతకం చేస్తామని ఇప్పుడు ఒబామా సర్కార్‌ నమ్మబలుకుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకు ఎందుకు ఆమోదించలేదంటే సాంకేతికంగా తామాపని చేయకపోయినా పరీక్షలను నిలిపివేశాము కదా అని అడ్డగోలు వాదనకు దిగుతోంది. అదే వాదన తమకు మాత్రం ఎందుకు వర్తించదని ప్రశ్నించకుండా ముందు జాగ్రత్తగా తాము కూడా ఆమోదిస్తామని చెబుతోంది. అయితే అందుకు అవసరమైన మూడింట రెండువంతుల మెజారిటీ అమెరికా పార్లమెంట్‌లో ఒబామాకు లేదన్నది గమనించాలి. అవసరం లేకుండానే జపాన్‌పై అణుబాంబులను ప్రయోగించి మారణకాండకు పాల్పడటమేగాక ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికానే ఈ అణ్వాయుధపోటీకి ఆజ్యం పోసింది.



ఇంతజరిగినప్పటికీ మరోసారి తాము ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పటానికి అమెరికా సిద్దం కావటం లేదు. భద్రతా మండలి తీర్మానంపై మనదేశం స్పందించిన తీరు హర్షణీయమే. అందుకు కట్టుబడి ఉంటుందా అన్నదే అనుమానం. ఇరాన్‌ ఎన్‌పిటిపై సంతకాలు చేసినప్పటికీ రహస్యంగా అణ్వాయుధాల తయారీకి పూనుకుందన్న తప్పుడు ప్రచారంతో దానిని సాధించేందుకు పూనుకుంది. అందువలన అమెరికాను నమ్మటానికి వీలులేదు. ప్రపంచవాణిజ్య సంస్థలో వ్యవసాయసబ్సిడీలపై అమెరికా, ఇతర ధనికదేశాల వైఖరిని ఇంతకాలం వ్యతిరేకించిన మనదేశం ఇప్పుడు దోహాదఫా చర్చలకు ముగింపు పలికే చొరవకు పూనుకుందంటే మనం లొంగిపోయామా? ధనిక దేశాలు దిగివచ్చాయా అంటే రెండవదానికి ఎలాంటి రుజువు లేదు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం విషయంలో కూడా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మన దేశాన్ని అణుదేశంగా గుర్తించినా లేకున్నా ఆ ఒప్పందాన్ని అంగీకరించేదిలేదని పార్లమెంటుకు, దేశ ప్రజలకు విస్పష్ట హామీ ఇవ్వాలి. దీనిపై తలెత్తిన అన్ని అనుమానాలను తొలగించాలి.

Note:article took from prajashakti paper

No comments:

Post a Comment