Thursday, 19 November 2009

అమెరికా దూకుడుకు పగ్గం వేసిన సంక్షోభం

కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది.


గతంలో చైనా పర్యటించిన అమెరికా అధ్యక్షులు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మాఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరించేవారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్‌ ఒబామా పర్యటన మౌలికంగా కాకున్నా ఒక ఎత్తుగడగా గతానికి భిన్నం. చైనాను డిమాండ్‌ చేయగలిగిన స్థితి నేడులేదు. చైనాకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకే గతనెలలో దలైలామా అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో భేటీకి సిద్ధం కాలేదు. ఆరురోజుల ఒబామా పర్యటన 13వ తేదీన జపాన్‌తో ప్రారంభమై 18న దక్షిణ కొరియాతో ముగుస్తుంది. ఆ సందర్భంగా చైనా తమకు ఒక కీలకమైన భాగస్వామిగా ఉండటంతో పాటు స్నేహపూర్వకమైన పోటీదారుగా కూడా ఉందని ఒబామా పేర్కొన్నాడు. చైనా పురోగమనాన్ని అడ్డుకోవాలని తాము అనుకోవటం లేదన్నారు. ఉభయదేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమతూకాన్ని సరిచేయని పక్షంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. మూడురోజుల చైనా పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘైకార్యక్రమాలలో పాల్గొన్న ఒబామా సోమవారం నాడు బీజింగ్‌ చేరుకున్నారు.



తామేంటో, తమశక్తేంటో చెప్పకుండానే చేసి చూపటంలో చైనీయులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. జూనియర్‌ బుష్‌ తాను అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాలూ ఓడిపోయినా తనదే పైచేయి అన్నట్లుగా నానా హంగామా చేశాడు. ఒబామా అలా చేయాలన్నా మారిన పరిస్థితులు అందుకు సహకరించేవిగా లేవు. అయితే సింహం దెబ్బతిన్నప్పటికీ దాని సహజలక్షణం కోల్పోదు. అమెరికా కూడా అంతే. తమ దగ్గర ప్రారంభమై ప్రపంచానికంతటికీ పాకించిన ఆర్థిక సంక్షోభంతో తాము ఒళ్లుదగ్గర పెట్టుకోకపోతే నష్టపోయేది తామే అని ప్రస్తుతానికి అమెరికన్లు తెలుసుకున్నట్లు ఈ పర్యటన సందర్భంగా ఒబామా చేస్తున్న ప్రకటనలు ఉన్నాయి. చైనా-అమెరికా విరోధులు కావని ఒకటికి రెండుసార్లు పేర్కొన్నారు. మాయలపకీరు ప్రాణం సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలోని చిలకలో ఉందన్నట్లుగా ఇప్పుడు అమెరికా జీవనాడులు చైనా చేతుల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఒక ఎత్తుగడగా అయినా స్నేహం కనపరుస్తున్నది. ఇదే సమయంలో చైనాకు ఉండే ప్రమాదాలు ఉన్నాయి.



చైనాలోని చాంగ్‌షాలో ఉన్న చైనా రక్షణ సాంకేతిక విశ్వవిద్యాలయం రూపొందించిన తైనహె అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఒబామా పర్యటన సందర్భంగా విడుదల చేశారు. దాని శక్తి ఎంతంటే సెకనుకు లక్షకోట్లకు పైగా సమస్యలను పరిష్కరించగలుగుతుంది. ఓ అమెరికా నీవేకాదు, మేం కూడా నీవద్ద ఉన్న సూపర్‌ కంప్యూటర్లకు తీసిపోని వాటిని తయారు చేయగలం అని చెప్పటమే దీని ఉద్ధ్యేశం. అమెరికాతో సహా పశ్చిమ దేశాలు సంక్షోభం నుంచి ఎప్పటికి బయటపడతాయో తెలియని స్థితిలో ఉండగా చైనా మాత్రం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తొమ్మిదిశాతం అభివృద్ధిని నమోదు చేసింది. ఈ శతాబ్ది మధ్యనాటికి తాము ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలిగిన సైనికపాటవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోగలమని కూడా ఒబామా పర్యటనకు ముందు చైనా వైమానిక దళాధిపతి క్జు క్విలాంగ్‌ రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది చైనా దౌత్యానికి నిదర్శనం.



కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అమెరికా టైర్ల కంపెనీల యాజమాన్యాలు చైనా నుంచి దిగుమతి అవుతున్న టైర్లపై ధ్వజమెత్తాయి. వారి వత్తిడికి లొంగి 35శాతం దిగుమతి పన్ను విధించటానికి సిద్ధపడ్డాడు. మాటైర్లపై పన్ను వేస్తే మీ ఆటోమొబైల్స్‌, కోడిమాంసం సంగతి ఒక్కసారి ఆలోచించుకోండని చైనా హెచ్చరించటంతో తోకముడవక తప్పలేదు.



చైనా వద్ద ఉన్న డాలర్లను అప్పుగా తీసుకోకపోతే అమెరికాకు నేడు గడిచే స్థితిలేదు. అమెరికా జారీ చేసిన సెక్యూరిటీలలో నాలుగోవంతు చైనా వద్ద ఉన్నాయి. చైనా విదేశీ కరెన్సీ నిల్వలు రెండులక్షల కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనికంటే చైనాలో తయారయ్యే వస్తువులు చౌకగా ఉన్నందున అమెరికాకు ద్రవ్యోల్బణం సమస్యలు పరిమితంగా ఉన్నాయి. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో 13శాతం ఉద్దీపన పథకాలకింద ఖర్చు చేస్తున్నది. ఇది అమెరికా చేసిన ఖర్చు కంటే రెండింతలు, జర్మనీ కంటే ఐదురెట్లు ఎక్కువ.అమెరికా ఉద్దీపన అంటే దివాళాతీసిన బ్యాంకులను ఆదుకోవటమే. నిరుద్యోగులైన కోట్లమంది గురించి పట్టించుకోవటం లేదు. పర్యావరణం పేరుతో అమెరికా గనుక రాయితీలను డిమాండ్‌ చేస్తే తాము ప్రపంచంలో డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీని ఉనికిలోకి తెచ్చేందుకు మద్దతు ఇస్తామని చైనీయులు పరోక్షంగా హెచ్చరించారు.



అందువలన గతం కంటే ఇప్పుడు చైనాపై అమెరికా ఆధారపడటం మరింత పెరిగింది. అమెరికా జీవన విధానం చైనాలో తయారవుతున్నదని యూరోపియన్లు అమెరికన్లపై జోకులేస్తున్నారు. అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి ఇంజను వంటిది. విశ్వ శాంతి, సంపదలకు తాము చెబుతున్న మార్కెట్‌ ఆర్థిక విధానమే శరణ్యమని అమెరికన్లు దశాబ్దాల తరబడి చెబుతున్నదంతా తాజా ఆర్థిక సంక్షోభంతో కొట్టుకుపోయింది. మరోవైపు చైనా తన విధానాలతో ఐరోపాలో అనేక మంది అభిమానులను సంపాదించుకోవటమే కాదు, ఆఫ్రికాలో తన పలుకుబడిని పెంచుకుంది. లాటిన్‌ అమెరికాలో దాని ప్రభావం నానాటికీ పెరుగుతున్నది. ఆ ప్రాంత దేశాలలో పెద్దదైన బ్రెజిల్‌ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా నేడు చైనా అవతరించింది.



ఇదే సమయంలో చైనా ఇప్పటికీ అమెరికాతో పోలిస్తే ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న విషయాన్ని విస్మరించరాదు. ప్రపంచంలో అమెరికా అతిపెద్ద మిలిటరీ శక్తిగా ఉంది. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఏటా ఆధునిక ఆయుధాలను సమకూర్చుతున్నది. టిబెట్‌ వేర్పాటువాదులకు మద్దతునిస్తున్నది. చైనాలో మానవ హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ప్రకటించినదాని ప్రకారం 1990 నుంచి 2009 వరకు చైనా జిడిపి 536శాతం పెరగ్గా ఇదే కాలంలో అమెరికాలో పెరుగుదల 61శాతమే. అయినప్పటికీ తలసరి ఆదాయంలో 46,443డాలర్లతో అమెరికా ఎంతో ముందుంది. చైనాలో 3,566 డాలర్లు ఉంది. ఇదే సమయంలో అమెరికాలో వృద్దిరేటు సగటున 2.8, అప్పు 3.4లక్షల కోట్ల డాలర్ల విదేశీ అప్పుతో సహా మొత్తం అప్పు 13లక్షల కోట్ల డాలర్లు, చైనాకు చేస్తున్న ఎగుమతులు 69.7 బిలియన్‌ డాలర్లు, చైనాతో వాణిజ్యలోటు 268 బిలియన్‌ డాలర్లు ఉంది.



మరోవైపున చైనాలో అభివృద్ధిరేటు తొమ్మిదిశాతం, విదేశీ మారకద్రవ్యనిల్వలు 2.3లక్షల కోట్ల డాలర్లు, అమెరికాతో వాణిజ్యమిగులు 268 బిలియన్‌ డాలర్లు ఉంది. రానున్న కొద్ది రోజుల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ స్థానాన్ని చైనా ఆక్రమించనుందని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగానే చమురు సంపదలున్న అరబ్బు దేశాలతో సహా ప్రపంచదేశాల రాజధానుల్లో అమెరికా కంటే చైనాతో కరచాలనం చేయటమే ఎక్కువ లాభమనే వాతావరణం క్రమంగా పెరుగుతున్నది.

Wednesday, 18 November 2009

శాస్త్రవేత్తలలో అశాస్త్రీయతం ఎందుకుంటోంది?




•పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

.''రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ'' (డిఆర్‌డిఓ)లో సీనియర్‌ శాస్త్రవేత్తలు ఎం కామేశ్వరరావు, ఎ ఎస్‌ఎస్‌వీ భాస్కర్‌లు నరబలిపేరిట జూనియర్‌ శాస్త్రవేత్త సుశీల్‌ కుమార్‌ను హత మార్చేందుకు ప్రయత్నించారు. అయితే సుశీల్‌కుమార్‌ తప్పించుకున్నారు. సీనియర్‌ శాస్త్రవేత్తలపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.


(ఆంధ్రజ్యోతి 13.10.09)


''హైదరాబాద్‌ నగరంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయంలో, సాంకేతిక విద్యాధికులందరి సమక్షంలో, పరిపాలనా భవనం నాలుగుమూలలా నాలుగు జంతువలను బలి ఇవ్వడం జరిగింది''


(ఈనాడు 16-10-94)


పై రెండు వార్తలే కాదు. పత్రికలలో శాస్త్రవేత్తలు, సాంకేతిక విద్యావేత్తల అశాస్త్రీయ చర్యలను గూర్చిన అనేక దిగ్భ్రాంతికరమైన వార్తలు నెలకొకటైనా వింటున్నాము. ఎందుకిలా జరుగుతోంది? నిరక్షరాస్యులు చేతబడులు నమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వారి నిరక్షరాస్యతే ఈ అజ్ఞానానికి దారితీసిందని సమాధానపడవచ్చు. కాని శాస్త్రాలను ఔపోసన పట్టినవారు, విద్యావికాసంతో పదిమందికీ తోవ చూపవలసిన వారు నరబలివంటి అమానుష చర్యలను ఎలా నమ్మి ఆచరిస్తున్నారు? వాటికి కారణాలేమిటి? ఈ అంశాలను పరిశీలిద్దాం.



మన రాజ్యాంగం-51ఎ (హెచ్‌) ఆర్టికల్‌ ప్రకారం ప్రజలలో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలాంటి అవగాహనను పెంపొందించడానికి ఉత్తమ సాధనం విద్య, ''జాతి నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని'' కోఠారి సెలవిచ్చారు. అలాంటి తరగతి గదుల్లో ఎక్కడా శాస్త్రీయ అవగాహనను పెంపొందించే విధానాలు అమలు కావడం లేదు. 1వ తరగతి నుండి పదవ తరగతి వరకూ ఏ క్లాసులోనూ, సిలబస్‌లో సమాజంలో నెలకొని ఉన్న మూఢ నమ్మకాలను ఖండించి శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ఒక్క అంశం కూడా చేర్చడం జరగలేదు. పైగా మానవ పరిణామాన్ని గూర్చిన శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ''డార్విన్‌ పరిణామవాదం వంటి పాఠాలు 10వ తరగతిలోపు ప్లిలలకు అందకుండా, సిలబస్‌ ఉండి తీసివేయడం జరిగింది. దానితో ఇంటర్‌లో బయాలజీ సబ్జెక్టు తీసుకోని విద్యార్థులు భవిష్యత్తులో పెద్ద ఇంజనీర్లయినా, ఛార్టర్‌ ఎకౌంటెంట్లయినా, గణితశాస్త్ర పార్టంగతులయినా సృష్టి, పరిణామం వంటి అంశాలకు సంబంధించినా శాస్త్రీయ వివరణలు తెలియకుండానే పెద్దవారౌతున్నారు. ఇక రెండో పక్క జ్యోతిష్యం, వాస్తుల వంటి అశాస్త్రీయ అంశాలలో డిగ్రీలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు, డాక్టరేట్లు విశ్వవిద్యాలయాలలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం కాదని స్టీఫెన్‌ హాంకింగ్‌ వంటి ప్రముఖ శాస్త్రజ్ఞునితో సహా ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వందలాది మంది బహిరంగ ప్రకటనలు చేసినా, వివేకానందుడు, దయానంద సరస్వతి, పోప్‌జాన్‌ పాల్‌ వంటి మత నాయకులు ''జ్యోతిషం ఒక మార్మిక కళ, దానిని నమ్మవద్దు'' అని హెచ్చరించినా జ్యోతిష్యం ఒక పాఠ్యాంశంగా విశ్వవిద్యాలయాల్లో రోజురోజుకూ బలంగా పాదుకుంటోంది. అలాగే వాస్తు కూడా. వాస్తు ఫలితాన్ని గూర్చి రాస్తూ పండింతులేమన్నారంటే ''పక్షేన, మాసేర, రుతుక్రమేణా, సంవత్సరేణా పిఫలం విధత్తే'' అని. అంటే వాస్తు ఫలితం ''పక్షం రోజుల్లో (అంటే 15 రోజుల్లో) గాని, నెల రోజుల్లో గాని, 6 నెలల్లో గాని, సంవత్సరంలో గాని సిద్ధిస్తుంది. ''అని అర్థం. ఎప్పుడో ఒకప్పుడు కీడు మూడుతుందని చెప్పడం శాస్త్రమా? ఫలానా వాస్తు దోషం వల్ల ఫలానా కీడు కచ్చితంగా ఫలానా కాలంలో జరుగుతందని చెప్పడం శాస్త్రమా? ఇలాంటి అశాస్త్రీయ అంశాలన్ని ''వాస్తు శాస్త్రం''గా పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం జాతి భవిష్యత్తుకు ఎంత కీడును కలిగిస్తుంది? పాలకులకు ఇలాంటి అశాస్త్రీయ విషయాలపైన నమ్మకముండటమే దేశానికి ప్రమాదకరం. వారు రాజ్యాంగాన్ని గౌరవించే రైతే ప్రజాశ్రేయస్సును కాంక్షించే వారైతే ఇలాంటి అశాస్త్రీయ విషయాలను నేరుగా డిగ్రీస్థాయిలో ప్రవేశపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయరు. దానికంటే, 1,2 కోట్లయినా సరే వెచ్చించి, కొందరు పరిశోధకులను నియమించి 5 సంవత్సరాలపాటు జ్యోతిష్య వాస్తు పండితుల జ్యోష్యాలన్నింటినీ పరిశోధించి, వాటిలో కనీసం 90శాతం సరైనవేనని తేలితే ఆ అంశాలను శాస్త్రీయ అంశాలుగా భావించి బోధించవచ్చు. (అసలు సైన్సు అంశం అంటే పరిశోధనా ఫలితాలు నూటికి నూరు సరైన, ముందుగా ఊహించిన ఫలితాలు వస్తేనే శాస్త్రీయ విషయం అంటాం) అలా కాకుండా ఏమిటీ ప్రజాధన దుర్వినియోగం? రాజ్యాంగ వ్యతిరేక భావజాల ప్రచారం?



కౌటిల్యుడు తన అర్థంశాస్త్రంలో ''రాజుకు మూఢ నమ్మకాలుండకూడదు గాని ప్రజలలో మూఢ నమ్మకాలు పెంచడానికి తీవ్రంగా యత్నించా''లంటాడు. 'దానికై రాజు గూఢచారుల ద్వారా ఏమేమి చర్యలు చేపట్టాలో'' సూచిస్తాడు. మన పాలకవర్గాలు దానిని బాగా వంట బట్టించుకుని అమలు చేస్తుండటం ప్రజలలో అశాస్త్రీయ భావాలు పెరగడానికి రెండో కారణం. కాకపోతే రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల నుండి డి.జి.పిల వరకూ వివాదాస్పదులుగా, మేజిక్‌ నిపుణులుగా, భూకబ్జాదారులుగా పేరొందిన స్వామిజీలు, బాబాలకు పాదాభివందనాలు ఎందుకు చేస్తారు?



మూఢ నమ్మకాల పెంపులో పాలవర్గాలకు చెందిన ప్రచార, ప్రసార సాధనాల వాటా కూడా చాలా ఉంది. మూఢ నమ్మకాలకు సంబంధించిన వార్తలను బాక్సులు కట్టి మరీ ప్రచురించిన పత్రికలు, వాటిపై పరిశోధన చేసి వాస్తవాల్ని వివరిస్తూ రాసిన లేఖలను, వ్యాసాలను బుట్టదాఖలు చేయడం ఈ రచయిలతో సహా అనేకమంది సైన్సు ప్రచారకుల అనుభవం. ఇక టి.వి ఛానళ్లు దయ్యాలు, చేతబడులు, అతీతశక్తుల కథలతోను, వారంవారం వచ్చే జ్యోతిష్య విశేషాలతోనూ, పసివారి నుండి వృద్ధుల వరకు ప్రజల మనస్సులను ఆక్రమిస్తున్నాయి. వాటి ప్రభావం ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఇన్ని రకాల ప్రభావాల కారణంగా సైన్సులో డాక్టరేట్‌లు సంపాదించిన వారు కూడా అశాస్త్రీయ భావజాలం నుండి బయటపడలేకపోతున్నారు. అందుకే నరబలి, జంతుబలులకు కూడా పూనుకుంటున్నారు.


ఈ పరిస్థితుల్లో సైన్సు కార్యకర్తలేం చేయాలి?


సిలబస్‌లో అశాస్త్రీయ అంశాలను ఉపసంహరించి, శాస్త్రీయ అంశాలను జొప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం, ఉద్యమించడం, దానిని సాధించడం దీర్ఘకాలిక కార్యక్రమం. అప్పటిదాకా కార్యకర్తలు ఏమి చెయ్యకుండా ఊరకుండకూడదు. అన్నంలోకి దంపుడు బియ్యం దొరకకపోతే బి విటమిన్‌ చాలక అనేక జబ్బులు వస్తాయి. అందుకని దంపుడు బియ్యం దొరికే వరకు వేచి ఉండక, రోజుకొక్క బి కాంప్లెక్స్‌ మాత్రను వేసుకుంటాం. అదేరకంగా పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

Note:Article took from Prajasakti paper Written by kantharao

Tuesday, 10 November 2009

బెర్లిన్‌ గోడతో పాటు బతుకఁలూ కూలాయి

ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లుగా బెర్లిన్‌ గోడను కూల్చగానే పెట్టుబడిదారీ విధానం జయించినట్లు కాదని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెబుతున్నారు. బెర్లిన్‌ గోడతో పాటు తూర్పుఐరోపా వాసుల బతుకులు కూడా కూలిపోయాయి. తెల్లవారే సరికి అనేక మంది దరిద్రులయ్యారు. తామొక మానవ సమాజంలో ఉన్నామన్న స్పృహను జనం కోల్పోయారని, కుటుంబవిలువలు దిగజారాయాని, చివరికి మతాన్ని కూడా పట్టించుకోకుండా వినిమయతత్వానికి గురయ్యారని చింతిస్తున్నారు. బెర్లిన్‌ గోడను కూల్చివేసి తూర్పు జర్మనీని పశ్చిమజర్మనీ కబళించి సోమవారం నాటికి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా జర్మనీ ప్రభుత్వం గోడకూల్చివేత ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, ఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ, బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.



సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌, మెర్కెల్‌ చెట్టాపట్టాలేసుకొని కూల్చివేసిన గోడ ప్రాంతంలో కొంతదూరం నడిచే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమ దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని పరిష్కరించటంలో విఫలమై దిక్కుతోచని నాయకులు జనం దృష్టిని కొద్దిసేపైనా మళ్లించేందుకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నారు. అయితే వారి సంతోషంపై బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌(బిబిసి) సంస్థ నిర్వహించిన సర్వే అంశాలు నీళ్లుపోశాయి. ప్రపంచవ్యాపితంగా 27 దేశాల పౌరులనుంచి సేకరించిన అభిప్రాయాలు వారికి వణుకు పుట్టించేవిగా ఉన్నాయి. ఎనభైతొమ్మిది శాతం పెట్టుబడిదారీ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధికులు ఇప్పటికీ సోషలిస్టు విధానమైన సంపదలను సమంగా పంపిణీ చేసే ప్రభుత్వ విధానం కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.



ఈ సర్వేలో భాగస్వామి అయిన గ్లోబ్‌స్కాన్‌ అధ్యక్షుడు డౌగ్‌ మిల్లర్‌ సర్వే ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ '' అప్పుడు అందరూ అనుకున్నట్లుగా, ముఖ్యంగా గత ఏడాదికాలంలో జరిగిన పరిణామాలను చూస్తే 1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేత స్వేచ్ఛామార్కెట్‌ పెట్టుబడిదారీ విధానానికి ఘనవిజయంగా కనపడటం లేదు.'' అన్నారు. సోషలిస్టు విధానంలోని సంపదలను సమంగా పంపిణీ చేయటం వంటి అంశాలు ఇప్పటికీ ప్రపంచంలో ఎందరినో ఆకర్షిస్తున్నాయని మరో భాగస్వామ్య సంస్థ 'పిపా' ప్రతినిధి స్టీవెన్‌ కుల్‌ వ్యాఖ్యానించారు. కేవలం పదకొండుశాతం మాత్రమే పెట్టుబడిదారీ విధానంగా బాగా పనిచేస్తున్నదని చెప్పారు. అమెరికాలో 25శాతం, పాకిస్తాన్‌లో 21 మంది అత్యధికంగా సమర్థించిన వారున్నారు. మార్కెట్‌ పెట్టుబడిదారీ విధానంలోప భూయిష్టమైనదని దాన్ని సంస్కరించటం, అదుపులో ఉంచాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు.



ప్రభుత్వం మరింత చురుకైన పాత్ర వహించాలని లేదా పెద్దపరిశ్రమలకు యజమానిగా ఉండాలని 15దేశాల వారు చెప్పటం విశేషం. ఇలా చెప్పిన వారిలో పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌లైన రష్యా, ఉక్రెయిన్‌తో బ్రెజిల్‌, ఇండోనేషియా, ఫ్రాన్స్‌కు చెందిన వారు 77 నుంచి 57శాతం వరకు ఉన్నారు. ఇరవైరెండు దేశాలకు చెందిన వారిలో మూడింట రెండువంతుల మంది ప్రభుత్వాలు సంపదలను సమంగా పంపిణీ చేయాలని చెప్పారు. సోవియట్‌ కూలిపోవటం చెడుపరిణామమని 22శాతం చెబితే తమకు దాని గురించి తెలియదని 24శాతం పేర్కొన్నారు. ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలకు చెందినవారు మాత్రమే మంచిపరిణామం అని ఎక్కువ మంది చెప్పారు. ఈజిప్పు వంటి దేశాలలో 69శాతం మంది హానికరమని తెలిపారు. ఈ సర్వే నిర్వహించిన బిబిసి గానీ, దానికి సహకరించిన వారు గానీ సోషలిజం, కమ్యూనిజాన్ని సమర్థించేవారు కాదని గ్రహించాలి.



తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని, దానిలో అమెరికాతో పాటు వాటికన్‌ చర్చి కీలకమైన పాత్ర నిర్వహించిందని అప్పుడు కమ్యూనిస్టులు చెబితే నిరాకరించిన వారు ఇప్పుడు పునరాలోచించుకోవాలి. బెర్లిన్‌ గోడ కూల్చివేత 20వ వార్షికోత్సవం సందర్భంగా జర్మన్‌ పత్రిక 'డెర్‌స్పీగల్‌' పోలెండ్‌ సాలిడారీటీ నాయకుడు లెచ్‌వాలేసాను ఇంటర్వ్యూ చేసింది. తమకు అనేక ఇతర దేశాల నుంచి మద్దతు లభించిందని ముఖ్యంగా పోప్‌ కీలకమైన పాత్ర వహించాడని ఒక్క పోలాండ్‌లోనే గాక అనేక చోట్ల ప్రార్ధనల ద్వారా సమీకరణ చేశాడని వాలేసా చెప్పాడు. మేం ఆందోళన ప్రారంభించేటపుడు ఇప్పుడు మనం చూస్తున్న పోలాండ్‌, ఐరోపాను చూడగలమని చెబితే నేనసలు నమ్మలేదు. అయినప్పటికీ ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే మేం కోల్పోయిన అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. నాకు సంతృప్తిగా లేదు, నేనెప్పుడూ చెబుతుంటాను నేను జరిగిందానికి అనుకూలం ఇదే సమయంలో దానికి వ్యతిరేకం కూడా అని.



మేం కోల్పోయిన అవకాశాల గురించి చెబుతాను. ప్రజాస్వామ్యం మూడు అంశాలతో కూడుకున్నది. ఒకటి బహుళత్వ సిద్ధాంతాలకు చట్టాలు మద్దతు ఇస్తున్నాయా లేదా అన్నది, రెండవది ఈ చట్టాలను పౌరులు ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా? మూడవది ఈ ప్రజాస్వామ్యం ద్వారా జనం తమ పర్సులు నిండుగా ఉండటానికి తోడ్పడిందా లేదా అన్నది చూడాలి. పోలండ్‌లో ప్రజాస్వామ్యానికి చట్టపరమైన పునాది ఉంది. అయితే ఇంతవరకు దానిని పూర్తిగా వినియోగించుకున్నట్లు మేం రుజువు చేయలేదు. ఇక మా పర్సుల విషయానికి వస్తే గతం కంటే పరిస్థితి ఘోరంగా దిగజారింది. సోషలిస్టు వ్యవస్థలను కూలదోయటంలో ముఖ్యపాత్ర వహించిన విద్రోహి లెచ్‌వాలేసాయే స్వయంగా ఇలా చెప్పిన తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో చెప్పనవసరం లేదు. సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ఎవరినైనా పావులుగా వాడుకోవటానికి వెనకాడరు.



తూర్పు ఐరోపాలో కమ్యూనిజాన్ని కూలదోసిన పోప్‌ను, తమ సాలిడారిటీని గానీ ఎవరూ ఇప్పుడు కనీసం ప్రస్తావన కూడా చేయటం లేదని వాలేసా ఉక్రోషం వెలిబుచ్చాడు. ప్రజాస్వామ్యం పేరుతో తాను రాజకీయ ఓటమికి అంగీకరించకతప్పలేదని, అది నా తలరాత.... నిజమైన విప్లవకారుడి తలరాత కూడా అని చరిత్ర చెత్తబుట్టలో ఉన్న వాలేసా తన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.


అమెరికాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ సోవియట్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేయటంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అయితే బెర్లిన్‌ గోడ కూల్చివేత పేరుతో తూర్పు జర్మనీని పశ్చిమ జర్మనీ ఆక్రమించకూడదని ఆ దేశాలన్నీ కోరుకున్నాయి. అది విడిగానే ఉండేట్లు చూడాలని ఆ దేశాల వారు స్వయంగా గోర్బచెవ్‌కు సలహాయిచ్చినట్లు సోమవారం నాడు అమెరికా విడుదల చేసిన నాటి సిఐఏ ఇతర పత్రాలు వెల్లడించాయి. బెర్లిన్‌ గోడను నవంబరు తొమ్మిదిన కూల్చివేయటం ప్రారంభిస్తే అంతకు ముందే పశ్చిమదేశాల వారు జర్మనీ ఐక్యం కాకుండా చూడాలని గోర్చచెవ్‌ను కోరారు.



అప్పటి బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ 1989 సెప్టెంబరు 23న ' నాటో ప్రకటనలో తామేమి పేర్కొన్నప్పటికీ తూర్పు ఐరోపాను అసిరపరచాలని, బ్రిటన్‌, పశ్చిమ ఐరోపా కూడా జర్మనీ ఐక్యతను కోరుకోవటం లేదని గోర్బచెవ్‌తో థాచర్‌ చెప్పారని తమ సంభాషణను రికార్డు చేయవద్దని థాచర్‌ కోరారని అయితే తాను వెంటనే బయటకు వచ్చి వాటిని గుర్తుకు తెచ్చుకొని తన డైరీలో రాసుకున్నట్లు నాటి గోర్బచెవ్‌ సహాయకుడు చెర్నయెవ్‌ పేర్కొన్నాడు. ఇలాగే ఇతర అగ్రనాయకులతో గోర్బచెవ్‌ జరిపిన సంభాషణల వివరాలను కూడా అమెరికా బయట పెట్టింది. ఒకవైపు గోడను కూల్చివేస్తుండగా అదే సమయంలో సమావేశమైన సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో అసలు దాని గురించి పట్టించుకోలేదంటే ఆ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.చివరగా చెప్చొచ్చేదేమంటే తూర్పు జర్మనీని ఆక్రమించిన పశ్చిమ జర్మనీ ఒకే దేశంగా ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల తరువాత కూడా తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మన్లతో సమంగా లేరు.



ఆ ప్రాంతంలో నిరుద్యోగం, దారిద్య్రం ఎక్కువగా ఉంది. జర్మనీ ఐక్యతకంటే గర్వంగా చెప్పుకోవటానికి మరొకటి లేదని నాడు ఛాన్సలర్‌గా ఉన్న హెల్మట్‌ కోల్‌ అంటున్నారు. అయితే దీనివలన తమకెలాంటి లబ్ది కలగలేదని 34 శాతం మంది పశ్చిమ జర్మన్లు చెప్పినట్లు తాజా సర్వే వెల్లడించింది. తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని 42శాతం మంది తూర్పు జర్మన్లు భావిస్తున్నారు. మాకు ప్రత్యేకతంటూ లేకుండా చేశారు. మా విద్యావ్యవస్థను మార్చివేశారు, జాతీయ పతాకం, గీతాన్ని రద్దు చేశారు, చివరికి ఉద్యోగాలను కూడా పోగొట్టారు. ఒకే తరహా ఉద్యోగం చేస్తున్న మాకు పశ్చిమ ప్రాంతంకంటే 20శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. పదిహేను లక్షల మంది తూర్పువారు పశ్చిమ ప్రాంతానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వారికి అక్కడి వారికి ఇచ్చే దానిలో మూడోవంతు మాత్రమే చెల్లిస్తున్నారు. ఐక్యత పేరుతో తమ దేశాన్ని ఆక్రమించి తమను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని తూర్పు జర్మన్లు భావిస్తున్నారు.