october 1st 2009
నేటికి సరిగ్గా అరవై ఏళ్ల క్రితం చైనా రాజధాని బీజింగ్లోని తియాన్మెన్ స్క్వేర్లో మావో సేటుంగ్ జనచైనా ఆవిర్భవించిందని అశేష ప్రజానీకం మధ్య ప్రకటించాడు. అప్పటివరకు ప్రజలు ఎన్నెన్నో కష్టాల పాల్జేసిన యుద్ధం ముగిసిందనడానికి అది సంకేతం. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన సాగిన విప్లవపోరాటం విజయవంతం అయిన రోజు అది. లక్షలాదిమంది కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం లెక్కలేనన్ని త్యాగాలు చేసి, రక్తం ధారవోసి ఆ విప్లవాన్ని సాధించారు. ఇది సామ్రాజ్యవాదుల దోపిడీనుండి, జపాన్ దురాక్రమణదారుల దురాగతాల నుండి విముక్తి అని, దశాబ్దాలుగా యుద్ధ ప్రభువుల చేతిలో తాము అనుభవిస్తున్న అంతులేని కష్టాలకు చరమగీతం అని చైనా ప్రజలు విశ్వసించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ వారి విశ్వాసాన్ని వమ్ముచేయలేదు. వారి అశలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి శాయశక్తులా కృషిచేసింది.
దాని ఫలితమే నేటి నవ చైనా. తరతరాల వలస పాలకుల దోపిడీ వల్ల ఒక నాడు అత్యంత వెనుకబడిన దేశంగానూ, ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న దేశంగానూ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే అగ్రదేశాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అమెరికా, జపాన్, జర్మనీల తర్వాత నాల్గవ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. ఒకప్పుడు తనపై పెత్తనం చేసిన గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి సామ్రాజ్యవాద దేశాలను వెనక్కి నెట్టివేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా దాదాపు ఏడాదికి 10 శాతం చొప్పున ఆర్ధికాభివృద్ధి సాధిస్తూ వచ్చింది. మరింత కచ్చితంగా చెప్పాలంటే 1979-2007 మధ్య కాలంలో చైనా సగటు వార్షికాభివృద్ధి రేటు 9.8 శాతం. ఇది అదే కాలంలో ప్రపంచ సగటు వార్షికాభివృద్ధితో పోల్చుకుంటే 6.8 శాతం అధికం. అంతేకాదు ప్రపంచ జిడిపిలో చైనా వాటా కూడా ఇంతే వేగంగా పెరిగింది.
1978లో ఇది 2.3 శాతం అయితే, 2006 నాటికి 14.5 శాతానికి పెరిగింది. జిడిపి పరిమాణం రీత్యా పోల్చుకున్నపుడు అమెరికా జిడిపి 12 ట్రిలియన్ డాలర్లు (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) అయితే, చైనా జిడిపి 4 ట్రిలియన్ డాలర్లు. ఇటీవల కాలంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకుంటున్న భారత దేశం జిడిపి 1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. 1 ట్రిలియన్ డాలర్ల క్లబ్బులో చేరామని మనం గొప్పగా సైతం చెప్పుకున్నాం. ప్రపంచ జిడిపిలో ి వాటా రీత్యా చూసుకుంటే 2000 నాటికి అమెరికా వాటా 27 శాతం, చైనా వాటా 12 శాతం, భారత దేశం వాటా కేవలం 5 శాతంవంద కోట్లకు పైగా జనాభా కలిగిన చైనాను 2050 నాటికల్లా మధ్య శ్రేణి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని 1980ల ఆరంభంలో చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం ప్రకటించింది. కాని చైనా ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయం కన్నా ఎంతో ముందుగానే సాధించే దిశగా పయనిస్తున్నది. 1980- 2000 మధ్య కాలంలో చైనా జిడిపి నాలుగు రెట్లు అధికమయింది.
చైనా తలసరి ఆదాయం 2020 నాటికి 3200 డాలర్లు కావాలన్నది లక్ష్యం. కాని 2008 నాటికే 3000 డాలర్ల తలసరి ఆదాయాన్ని చైనా సాధించింది. చైనా సాధించిన అభివృద్ధి గురించి మరింత సూటిగా చెప్పుకోవాలంటే 1952తో పోల్చుకున్నపుడు చైనా జిడిపి 400 రెట్లు పెరిగింది.
ఇంతటి అభివృద్ధిని చైనా తేలిగ్గా సాధించలేదు. అంతర్గతంగాను, బయటినుండి అనేక సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొని విజయవంతంగా అధిగమించింది. ఈ అద్భుత అభివృద్ధి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన స్థూలంగా సోషలిస్టు సూత్రాలకు కట్టుబడి సాగించిన పయనం మూలంగానే సాధ్యమయింది. చైనా విప్లవ అరవయ్యో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాలో చైనా రాయబారి జావో రియాంగ్జి క్యూబా న్యూస్ ఏజన్సీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పారు:''చైనా చారిత్రక పురోగమన క్రమానికి అనుకూలమైన, అవసరమైన మార్గం సోషలిజమే అని గట్టిగా విశ్వసించిన చైనా ప్రజలు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. సోషలిజం మాత్రమే అభివృద్ధిని కాపాడుతుంది, సాధిస్తుంది. సుసంపన్నమైన, నాగరిక, ప్రజాతంత్ర, సామరస్య దేశాన్ని సాధించడం మా లక్ష్యం.''
విప్లవం అనంతరం మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రధాన చర్య భూసంస్కరణలు. 1949-50లో అమలు జరిగిన భూసంస్కరణలు భూస్వాములనుండి స్వాధీనం చేసుకొని 40 శాతం భూమిని పేదలకు పంచి పెట్టింది. దీనిమూలంగా 60 శాతం మంది ప్రజలకు ప్రయోజనం కలిగింది. కొత్తగా భూమిని పొందిన రైతాంగం ఎంతో ఉత్సాహంగా పంటలు పండించారు. ఆ తర్వాత రైతులు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను కూడ అభివృద్ధి చేశారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎంతో వేగంగా పెరిగాయి. అదే సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ పారిశ్రామికాభివృద్దికి అవసరమైన యంత్రాలను, నిపుణులను కూడ పంపించి సహకరించడంతో చైనా ఈ రంగంలోనూ పురోగతి సాధించింది. సరిగ్గా ఇలాంటి దశలోనే ఒక్కసారిగా ఆర్థికాభివృద్ధిని అధికం చేయాలన్న పేరుతో చైనా పార్టీ నాయకత్వం ''పెద్ద అంగతో ముందుకు'' (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) అనే విధానాన్ని చేపట్టింది.
1958-62 మధ్య కాలంలో ఈ విధానం అమలు జరిగింది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన స్టీలు, బొగ్గు, విద్యుత్తు లాంటి వాటి ఉత్పత్తికి వూహకందని రీతిలో లక్ష్యాలను నిర్దేశించి వాటికోసం తీవ్రమైన వత్తిడికి ప్రభుత్వం పాల్పడింది. దీనితో నాణ్యతతో నిమిత్తం లేకుండా పరిమాణం మాత్రమే పెంచడంతో పెరిగిన ఉత్పత్తిలో వృధా వాటా అధికం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపున రైతులు స్వచ్ఛందంగా సమిష్టి క్షేత్రాలను ఏర్పాటుచేసుకోవడానికి బదులు, వారిని బలవంతంగా కమ్యూన్లుగా మార్చివేసింది. అందరూ కలిసి పనిచేయడం, ఒకేచోట తినడం లాంటి పద్ధతుల వల్ల వ్యక్తిగత ప్రోత్సాహకాలకు అవకాశం లేకపోవడంతో ఉత్పత్తి క్షీణించింది. ఇలాంటి మార్పులతో గొప్ప ముందడుగు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ఎన్నో అనర్ధాలు కూడ సంభవించాయి. దీని తర్వాత అంతకన్నా పెద్ద పొరపాటుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పూనుకుంది. అదే 1966 నుండి పదేళ్ల పాటు కొనసాగిన ''సాంస్కృతిక విప్లవం''.
భౌతిక ఉత్పత్తిని పెంచేశాము కాబట్టి ఇక మిగిలింది ప్రజల చైతన్యాన్ని పరివర్తన చేయడం మాత్రమే అన్న పేరుతో ఇది సాగింది. ఈ కాలంలో జరిగిన తప్పిదాలకు లెక్కేలేదు. లీ షావ్చీ, డెంగ్ సియావో పింగ్ లాంటి పార్టీ అగ్రనేతలను పెట్టుబడిదారీ మార్గానికి అనుకూలురని ముద్రవేసి వేధింపులకు, నిర్బంధాలకు గురిచేశారు. వయసు మీరిన మావోను అడ్డం పెట్టుకొని ఆయన భార్య జియాంగ్ కింగ్ నాయకత్వాన ''దుష్ట చతుష్టయం'' రాజ్యమేలింది. ఎంతో మంది మేధావులను శారీరక శ్రమ చేయాలనే పేరుతో విద్యాలయాలనుండి తొలగించి పంటపొలాలలోకి పంపడం లాంటి విపరీత చర్యలు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. విప్లవంలోను, అనంతర కాలంలోను పార్టీకి ఎంతో విశ్వాసంతో సేవలందించిన ఎందరో ఈ విధమైన నిర్బంధచర్యలకు గురయ్యారు. 1976 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీయే ఈ ఘోర తప్పిదాన్ని గుర్తించి, సవరించుకుంది. దాని ఫలితంగానే డెంగ్ సియావో పింగ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
డెంగ్ నేతృత్వంలో చైనా పార్టీ సంస్కరణల బాటను చేపట్టింది. అదే సమయంలో బారత్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంస్కరణలను చేపట్టాయి. నయా ఉదారవాద బాటలో చేపట్టిన ఈ చర్యలకు, చైనాలో సంస్కరణలకు కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఈ రెండు తరహాల నేపధ్యం మాత్రం పూర్తి భిన్నమైనది. విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం కల్పించిన చైనా, తన దేశంలో అపారంగా లభించే మానవవనరులతో వాటిని సద్వినియోగం చేసుకొని తన ఉత్పత్తిని విపరీతంగా పెంచుకున్నది. సంపన్న దేశాలతో పోల్చుకున్నపుడు ఎంతో చౌకగా తయారయిన ఈ ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తన విదేశీ మారక నిల్వలను బ్రహ్మాండంగా పెంచుకున్నది. ఈ సరళీకృత విధానాల వల్ల అనివార్యంగానే ప్రాంతీయ అసమానతలు, వ్యక్తుల ఆదాయాల మధ్య అసమాతనలు చోటుచేసుకున్నాయి. వాటిని గుర్తించి సరిచేసుకొని తనదైన రీతిలో చర్యలు చేపడుతున్నది. ప్రజాస్వామ్యం కోసం అంటూ తియాన్మెన్ స్క్వేర్లో విద్యార్థులు, యువకులు సమీకృతులైన ఘటనను ఆసరాగా చేసుకుని చైనాను అస్థిరత్వం పాల్జేయాలని పశ్చిమ దేశాలు ఎన్ని కుతంత్రాలకు పాల్పడినప్పటికీ చైనా ప్రభుత్వం దానిని సమర్ధవంతంగా అధిగమించింది.
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను పెంచుకున్న చైనా ఇటీవల సంభవించిన ప్రపంచ పెట్టుబడి దారీ సంక్షోభం ప్రభావానికి సహజంగానే గురయింది. అయినప్పటికీ, ఈ ప్రభావం నుండి బయట పడడానికి ఎంచుకున్న మార్గంలోనూ చైనా తన విశిష్టతను నిలుపుకున్నది. పెట్టుబడిదారీ దేశాలన్నీ ఈ సంక్షోభానికి కారణమయిన ఆర్ధిక సంస్థలు, పారిశ్రామిక సంస్థలకే సహాయాన్ని అందచేసి ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సంక్షోభం మూలంగా ఉపాధి కోల్పోయి వీధులపాలయిన లక్షలాది సాధారణ ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి పూర్తి భిన్నంగా చైనా ఇప్పటి వరకు విదేశీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని సాగించిన ఉత్పత్తిని దేశీయ మార్కెట్లో విక్రయించడానికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజల ఉపాధిని పరిరక్షించడానికి నేరుగా చర్యలు గైకొంటున్నది. ఇదే చైనా మార్గం ప్రత్యేకత. చైనా ఆర్థిక సంస్కరణలను చేపడుతున్నది, మేమూ చేపడుతున్నాము అని చెప్పే వారికి ఈ చర్యలు సమాధానం చెబుతాయి.
చైనా అనుసరిస్తున్న సంస్కరణల మార్గము, దాని ద్వారా సాధించిన అభివృద్ధి ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు మన ముందున్నాయి. ఏదేమయియినప్పటికీ చైనా సాధించిన అపారమైన ఆర్థికాభివృద్ధి తిరుగులేని వాస్తవం. అందుచేత సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ, అది అనుసరించిన మార్గంలోని తప్పొప్పులను తులనాత్మకంగా అంచనా వేయవలసిన అవసరం ఉంది. అలాంటి విశ్లేషణ, గుణపాఠాలు మాత్రమే ప్రపంచ దేశాల ప్రజానీకానికి ఉపయోగపడతాయి.
No comments:
Post a Comment